లక్నో: తాను బీజేపీలోనే ఉన్నానని, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి తెలిపారు. పార్టీకి తాను చాలా అంకితభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసినట్లుగా వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ స్పందించారు. తన రాజీనామా గురించి పార్టీకి ఎలాంటి లేఖ రాయలేదని మీడియాతో అన్నారు. తప్పుడు వదంతులు ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార బీజేపీకి చెందిన కొందరు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి కూడా బీజేపీకి రాజీనామా చేసినట్లుగా వదంతులు వచ్చాయి. అయితే దీనిని ఆయన ఖండించారు. తాను బీజేపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. అంకితభావంతో పార్టీతోనే ఉంటానని చెప్పారు. తప్పుడు వదంతులు ప్రచారం చేసిన వారిపై కేసు పెడతానని ఆయన హెచ్చరించారు.