శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా డాంగ్రీ గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు.. పౌరులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పుల ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డాంగ్రీ విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యుడు బాల్ క్రిషన్.. ఇవాళ ఘటన గురించి వెల్లడించారు.
ఉగ్రవాదులు ఆకస్మికంగా గ్రామంలోకి ప్రవేశించి కాల్పులు మొదలుపెట్టారని, దాంతో తాను అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపానని బాల్ క్రిషన్ చెప్పారు. కొందరిపై కాల్పులు జరిపి పారిపోతుండగా కొంతదూరం తాను వాళ్లను వెంబడించానని తెలిపారు. అయితే, ముందే తాను సిద్ధంగా లేకపోవడంవల్ల ఎక్కువ దూరం చేజ్ చేయలేకపోయానన్నారు.
ఆ రోజు తాను ఎదురు కాల్పులకు దిగడంతో దాదాపు 40 నుంచి 45 మంది ప్రాణాలు దక్కాయని, లేదంటే వాళ్లందరినీ ఉగ్రవాదులు చంపేసేవారని బాల్ క్రిషన్ తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోదీ తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు, తమ పరిసర గ్రామాల ప్రజలకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.