దేశ విభజనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మద్దతు పలికారు. మతపరమైన ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చారిత్రక తప్పిదమన్న రాజ్నాథ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. దేశ విభజన జసమయంలో భారతీయ ముస్లింలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. భారత్ పాక్ మధ్య తలెత్తే ఉద్రిక్తతల వల్ల దేశంలో మతపరమైన ఘర్షణలు జరుగుతాయని, భారత్, పాక్ ఒకే దేశంగా ఉంటే ఇలాంటి ఉద్రిక్తతలకు ఛాన్సే ఉండేది కాదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
1971 లో పాక్పై భారత సైన్యం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వర్ణిమ్ విజయ్ పర్వ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మతపరమైన ప్రాతిపదికగా దేశాన్ని విభజించడం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్ను విచ్ఛిన్నం చేయాలని పాక్ ఆలోచిస్తోందని, 1971 లో పాక్కు భారత సైన్యం దీటైన జవాబిచ్చిందని గుర్తు చేశారు. సైన్యానికున్న ధైర్య సాహసాలతో ఉగ్రవాద మూలాలను తొలగించే కార్యక్రమం సమర్థవంతంగా సాగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.