(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ను ఎక్స్లెన్స్ సెంటర్గా మారుస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. చిరు ధాన్యాలకు బ్రాండింగ్ ఇచ్చేలా వాటిని ‘శ్రీ అన్న’ అని సంబోధించిన నిర్మల.. దేశంలో వీటి ఉత్పత్తిని పెంచటంతో పాటు విదేశాలకు ఎగుమతులు పెంచటానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
మినుములు, జొన్నలు, రాగి, సజ్జ, సామలు తదితర చిరుధాన్యాలను పండించేందుకు రైతులను ప్రోత్సహించనున్నట్టు వివరించారు. వీటి ఉత్పత్తి, నిల్వ, జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకొంటుందని తెలిపారు. మిల్లెట్స్పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, ఇప్పటికే భారత్ చిరుధాన్యాల ఎగుమతిలో ప్రపంచ హబ్గా నిలిచిందని వెల్లడించారు. చిరుధాన్యాల వినియోగంతో మెరుగైన పోషకాహారం లభించటంతో పాటు, చిన్న, సన్నకారు రైతులకు జీవనోపాధి పెరుగుతుందని పేర్కొన్నారు.