ఓ నోయిడా వ్లాగర్ తన పెంపుడు కుక్కను కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి.. దానికి పసుపు తిలకం దిద్దాడు. ఆలయ ఆచారాన్ని కించపరిచినందుకు చిక్కుల్లో పడ్డాడు. ఆలయ కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. నోయిడా నివాసి అయిన 33 ఏళ్ల వికాస్ త్యాగి చార్ధామ్ యాత్రలో భాగంగా నవాబ్ అనే తన నాలుగున్నరేళ్ల పెంపుడు కుక్కని కేదార్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లాడు. నవాబ్ ఆలయం వెలుపల ఉన్న నందిని తన పంజాతో తాకి, ఆశీర్వాదం తీసుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిని ‘కించపరిచే, అభ్యంతరకరమైన, ఖండించదగిన చర్య’ అని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ పేర్కొంది. కుక్క యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. యజమానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. వైరల్గా మారిన ఈ వీడియో ప్రజలు, యాత్రికుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కమిటీ పేర్కొంది. ఇలాంటి వ్లాగర్లకు భక్తి ఉండదని, రీళ్లు, వీడియోలు షూట్ చేసేందుకు మాత్రమే మతపరమైన ప్రదేశాలకు వస్తారని కమిటీ సభ్యుడు ఒకరు మండిపడ్డారు. కాగా, ఆలయంలో రద్దీగా ఉండడం వల్ల భద్రతా ఏర్పాట్లలో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.