గోవా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ దశ తిరగనుంది. ఇన్ని రోజుల పాటు భాగస్వామిపక్షంగా ఉన్న ఈ పార్టీ.. ఇప్పుడు ఒక్కసారిగా కింగ్మేకర్ స్థాయికి ఎదిగిపోయింది. రాష్ట్ర రాజకీయాలను బొంగరంలా తిప్పే స్థాయికి చేరుకుంది. గోవాలో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ రాదని, 13 నుంచి 17 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నాయి. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21సీట్లు అవసరం.అయితే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ కింగ్ మేకర్గా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో ఈ పార్టీకి గిరాకీ పెరిగింది.
హంగ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో జాతీయ పార్టీలు మంతనాలకు తెర లేపాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ గోమంతక్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాయి. మరోవైపు తృణమూల్తో పొత్తుకు గోమంతక్ పార్టీ మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు సుదిన్ ధవళీకర్ పేర్కొన్నారు. అయితే పాత కాపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా? అన్న విషయంపై ఆయన మౌనం వహించారు. టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యాను. చాలా విషయాలు వారితో ప్రస్తావించా. అయితే పొత్తుపై మాత్రం ఇప్పుడే చెప్పలేను అని సుదిన్ ధవళీకర్ అన్నారు. అయితే తాము 10 సీట్ల కంటే అధికంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.