(స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు నోరెత్తితే దేశానికి గుజరాత్ మాడల్ అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ప్రజారోగ్య వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది. గుజరాత్లోని ప్రభుత్వ దవాఖానలన్నీ ఖాళీలు, మౌలిక వసతుల కొరతతో కునారిల్లుతున్నాయి. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు కనిపించరు. నర్సులు, ఆయాల సంగతి చెప్పక్కర్లేదు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయదు. గత 15 ఏండ్లుగా ఇదే పరిస్థితి. గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ లాంటి స్పెషలిస్టుల గురించి మాట్లాడుకోకపోవటమే నయం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,477 పీహెచ్సీల్లో 2,457 నర్సులు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 379 పీహెచ్సీల్లో డాక్టర్లు లేరు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్టు డాక్టర్లు లేరు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,392 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉండగా, 1,379 స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇక, 222 రేడియాలజిస్టు, 308 పారా కెమిస్ట్, 347 ల్యాబ్ టెక్నీషియన్, 944 నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
17 ఏండ్లుగా అదే దుస్థితి
గత 17 ఏండ్లలో కొత్తగా ఒకే ఒక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. దీన్ని బట్టి గుజరాత్ ప్రజారోగ్య వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నదో ఊహించుకోవచ్చు. పైగా, 14 పీహెచ్సీ కేంద్రాలను మూసేసింది.