న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న దవాఖానల్లో ఎంతోకాలంగా భారీగా ఉద్యోగ ఖాళీలు పేరుకుపోయాయని ఆ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. ఎయిమ్స్ వంటి వైద్యశాలల్లో కూడా దీర్ఘకాలంగా ఖాళీలు పేరుకుపోవటంతో సంస్థల నిర్వహణ గాడితప్పుతున్నదని రాజ్యసభకు గురువారం సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. ఢిల్లీ ఎయిమ్స్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఇప్పటికీ 404 గ్రూప్-ఏ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఈ దవాఖానలో గ్రూప్-బీ పోస్టులు 26.81 శాతం, గ్రూప్-సీ పోస్టులు 20.73 శాతం ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది. ఖాళీలను భర్తీచేసేందుకు ఆరోగ్యశాఖతోపాటు ఎయిమ్స్ కూడా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలోని ఇతర దవాఖానల్లో కూడా ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
త్రివిధ దళాల్లో 1.35 లక్షల ఖాళీలు
దేశ రక్షణలో కీలకమైన త్రివిధ దళాల్లో సిబ్బంది కొరత నెలకొన్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాల్లో మొత్తంగా 1.35 లక్షల సిబ్బంది కొరత ఉన్నదని, ఆర్మీలోనే ఈ సంఖ్య ఏకంగా 1.18 లక్షలు ఉన్నదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది.
రాజ్యసభలో జ్యుడీషియల్ కమిషన్ బిల్లు
సుప్రీంకోర్టు సీజేఐ సహా ఇతర న్యాయమూర్తుల నియామకం కోసం రాజ్యసభలో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు-2022ను ప్రవేశపెట్టారు. శుక్రవారం సీపీఎం నేత బికాస్ రంజన్ భట్టాచార్య దీనికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును సభ ముందుంచారు. ఈ బిల్లును ఆమ్ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది. ‘1993, 1998, 2016లో ఎన్జాక్పై సమీక్ష జరిగింది. అన్ని సందర్భాల్లో సుప్రీం దాన్ని కొట్టేసింది. రాజ్యాంగబద్ధంగా వీలుకాని బిల్లును ప్రవేశపెడుతున్నాం. కొలీజియం వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నది’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మరోవైపు ఆలిండియా జ్యుడీషియల్ సర్వీస్ (ఏఐజేఎస్)ను తీసుకొచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం తెలిపింది.