న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్లను కైవసం చేసుకున్నారు. మద్రాస్ ఐఐటీలో 25 మందికి, గౌహతి ఐఐటీలో ఐదుగురికి, రూర్కీ ఐఐటీలో ఇద్దరికి ఈ ఆఫర్లు లభించాయి. నిరుడు మద్రాస్ ఐఐటీలో 407 మంది ప్రీ-ప్లేస్మెంట్లు పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 10% పెరిగింది.
దీంతో ఈ ఏడాది అత్యధిక విద్యార్థులకు ప్రీ-ప్లేస్మెంట్లు కల్పించిన విద్యాసంస్థగా మద్రాస్ ఐఐటీ రికార్డు సృష్టించింది. ఈసారి మద్రాస్ ఐఐటీ విద్యార్థులకు ఎక్కువగా జాబ్ ఆఫర్లను ఇచ్చిన కంపెనీల్లో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ (14 ఆఫర్లు), బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్ చేతక్ టెక్ లిమిటెడ్ (10), జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో (9), క్వాల్కమ్ (8), ప్రోక్టర్ అండ్ గాంబుల్ (7), మోర్గాన్ స్టాన్లీ (6), గ్రావిటన్ (6), మెకిన్సే అండ్ కంపెనీ (5), కొహెసిటీ (5) ఉన్నాయి. గౌహతి ఐఐటీలో శుక్రవారం నుంచి ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది.
ఈ విద్యాసంస్థలో తొలి రోజే 84 కంపెనీలు వివిధ విభాగాల్లో మొత్తం 290 మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. వీరిలో ఐదుగురు రూ.కోటి వార్షిక ప్యాకేజీతో ఆఫర్లను కైవసం చేసుకోగా, మరో ఇద్దరు ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లను అందుకున్నారు. గౌహతి ఐఐటీ విద్యార్థులకు జాబ్ ఆఫర్లను ఇచ్చిన ప్రధాన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, గూగుల్, ఉబర్, క్వాల్కమ్, సీ-డాట్, ఎన్ఫేజ్ ఎనర్జీ, ఒరాకిల్, నూటనిక్స్, థాట్స్పాట్ ఎంటీఎస్-2, స్కేర్పాయింట్ ఎస్డీఈ/క్వాంట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, జేపీ మోర్గాన్ చేజ్, బజాజ్, రిప్లింగ్, టిబ్రా, కొహెసిటీ, స్ప్రింక్లర్ ప్లాట్ఫామ్+ ప్రొడక్ట్ తదితర సంస్థలున్నాయి.
ఇదేవిధంగా రూర్కీ ఐఐటీలో ఒక విద్యార్థి రూ.కోటి ప్యాకేజీతో ఇంటర్నేషనల్ ఆఫర్ను అందుకోగా.. మరో విద్యార్థి రూ.1.30 కోట్ల ప్యాకేజీతో డొమెస్టిక్ జాబ్ ఆఫర్ను కైవసం చేసుకున్నాడు. ఈ విద్యాసంస్థలో మరో 10 మందికి రూ.80 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్ ఆఫర్లు లభించినట్టు అధికారులు వెల్లడించారు.