హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని యువత అందిపుచ్చుకోవాలని అమెరికా కాన్సల్ జనరల్ జోయెల్ రీఫ్మన్ పిలుపునిచ్చారు. ఈ రెండు రంగాల్లో భారత్, అమెరికా మధ్య పటిష్ఠ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తల కోసం అమెరికా కాన్సులేట్, ద అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రిసెర్చ్ (ఏసీఐఆర్) ఆధ్వర్యంలో శంషాబాద్లోని జీఎమ్మార్ ఇన్నోవెక్స్లో నిర్వహిస్తున్న ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్క్షాప్’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రీఫ్మన్తోపాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఏసీఐఆర్ ఎండీ ఎరిక్ ఎజులే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రీఫ్మన్ మాట్లాడుతూ.. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంతోపాటు అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తున్నారని, రెండు దేశాల ఆర్థిక ప్రగతికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో స్టార్టప్స్ను ప్రోత్సహించడంలో మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఏసీఐఆర్ ఎండీ ఎరిక్ ఎజులే కొనియాడారు. టీహబ్ లాంటి ఇంక్యుబేటర్ల ద్వారా మంచి ఎకోసిస్టంను తయారుచేసి యువత ఆలోచనలకు కార్యరూపమిస్తున్నారని ప్రశంసించారు. ఈ వర్క్షాప్కు ఎంపికైన 26 స్టార్టప్స్కు 3 రోజులపాటు శిక్షణ ఇచ్చి వాటిని దేశ, విదేశాల్లోని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లతో కలిపేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. జయేశ్రంజన్ మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ ఎదిగిందని, లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్జీకే కిశోర్, లాక్హీడ్ మార్టిన్ ఇండియా సీఈవో విలియం బ్లేర్, బీడీఎల్ డిప్యూటీ జీఎం (డిజైనింగ్ అండ్ ఇంజినీరింగ్) చంద్రశేఖర్రావు, అదనపు జీఎం వినోద్కుమార్, అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.