న్యూఢిల్లీ: అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వందలాది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టుముట్టారు. ప్రతిఘటించడంతోపాటు అరెస్ట్ చేసిన నైజీరియన్లను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఆఫ్రికా దేశాల పౌరులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మాదకద్రవ్యాల వ్యతిరేక దళం విభాగం పోలీసులు నెబ్ సరాయ్ ప్రాంతంలోని రాజు పార్క్ వద్దకు వెళ్లారు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఢిల్లీలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వంద మందికిపైగా ఆఫ్రికా జాతీయులు పోలీసులను చుట్టుముట్టారు. సైజీరియన్ల అరెస్ట్ను అడ్డుకునేందుకు పోలీసులపై తిరుగబడ్డారు. దీంతో అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు తప్పించుకున్నారు.
కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటలకు నార్కాటిక్స్ బృందాలతోపాటు నెబ్ సరాయ్ పోలీసులు సంయుక్తంగా మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక మహిళతోపాటు నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది ఆఫ్రికన్లు పోలీసు బృందాలను చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకున్న వారిని తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. అరెస్ట్ చేసిన నైజీరియన్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. వీసా గడువు ముగిసిన వారిని దేశం నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Huge Mob Attacks Delhi Cops After 3 Nigerians Detained For Overstaying pic.twitter.com/OjLQ7JoyDr
— NDTV Videos (@ndtvvideos) January 8, 2023