బెంగళూరు: ఏటీఎంను లూఠీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. (Huge Cash Burnt) సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున నెలమంగళ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ వద్ద ఉన్న బ్యాంకు ఏటీఎంలోని డబ్బును దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్ తెచ్చి దానిని తెరిచారు. అయితే గ్యాస్ కట్టర్ ద్వారా వెలువడిన మంటలకు ఆ ఏటీఎంలోని కరెన్సీ కట్టలు కాలిపోయాయి.
కాగా, ముంబైలోని సంబంధిత బ్యాంకు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలు ఏటీఎంను తెరిచిన విషయాన్ని గ్రహించారు. వెంటనే బిల్డింగ్ యజమానిని అప్రమత్తం చేశారు. ఆ యజమాని ఏటీఎం వద్దకు చేరుకోగా ఆ దొంగలు గ్యాస్ కట్టర్ సామగ్రి వదిలి అక్కడి నుంచి పారిపోయారు. బ్యాంకు అధికారులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఏటీఎం లూఠీకి ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.