వర్లీ : శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్కేకు ముంబై వర్లీలోని శివసైనికులు షాకిచ్చారు. వర్లీలోని శివసేన కార్యకర్తలు మూకుమ్మడిగా సీఎం ఏకనాథ్ షిండే వర్గంలో చేరారు. దసరా పర్వదినాన నిర్వహించే ర్యాలీకి ముందు ఉద్దవ్ ఠాక్రేకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.
ముంబైలోని వర్లీకి చెందిన శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గంలో చేరారు. దాదాపు 3 వేల మంది శివసైనికులు ఏకకాలంలో షిండే వర్గంలో చేరడంతో వర్లీలో ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుదారులు లేకుండాపోయారు. దసరా పండగను పురస్కరించుకుని ఉద్దవ్ ఠాక్రే వర్గం ర్యాలీ నిర్వహించేందుకు ముంబై హై కోర్టు నుంచి అనుమతి కూడా పొందింది. ఇదే సమయంలో దాదాపు 3 వేల మంది శివసేన కార్యకర్తలు ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడటం విశేషం.
వర్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రవర్తన తీరుకు విసుగుచెందిన తామంతా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడి ఏకనాథ్ షిండే వర్గంలో చేరాలని నిశ్చయించుకున్నట్లు ఒక శివసైనికుడు చెప్పారు. ఆదివారం ఉదయం ముంబైలోని సీఎం అధికారిక నివాసం వర్షా బంగ్లాకు చేరుకున్న శివసేన కార్యకర్తలు షిండేను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఏటా దసరా పండగ రోజున నిర్వహించే ర్యాలీకి అనుమతించాలని రెండు వర్గాలు వేర్వేరుగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు లేఖలు ఇచ్చారు. అయితే, శాంతిభద్రతలను పేర్కొంటూ ముంబై పౌర సంఘం ఇరు వర్గాలకు అనుమతి నిరాకరించింది. దాంతో ఇరువర్గాలు కోర్టుకు చేరాయి. చివరకు ఈ నెల 2, 6 తేదీల్లో ర్యాలీ నిర్వహించుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఇదే సమయంలో వేల సంఖ్యలో శివసేన కార్యకర్తలు షిండే వైపు వెళ్లడంతో ఠాక్రే వర్గీయులు ర్యాలీ ఎలా నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.