Himachal Congress: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దాంతో స్పీకర్ ఆ ఆరుగురిపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారని సీఎం సుఖ్వీందర్సింగ్ సుఖూ వ్యాఖ్యానించారు.
సీఎం ప్రకటనపై ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజీందర్ రాణా మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేం కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచే మరో 9 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారు కాదని, సుఖూ మిత్రుల సర్కారు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో ఎవరూ లేరన్నట్లుగా బయటి వ్యక్తి అయిన అభిషేక్ మనుసింఘ్వీని ఇక్కడ రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దించారని, దాన్ని వ్యతిరేకిస్తూ తాము అభ్యర్థికి ఓటేశామని రాణా చెప్పారు. సోనియాగాంధీని నిలబెట్టినా మీరు ఇదే పని చేసేవారా..? అని మీడియా ప్రశ్నించగా.. సోనియాగాంధీ పార్టీ కోసం ఎంతో చేశారని ఆమె ఇక్కడి నుంచి బరిలో దిగాల్సి వస్తే అది వేరే విషయమని వ్యాఖ్యానించారు.
కాగా మంగళవారం హిమాచల్ప్రదేశ్లోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓటువేశారు. దాంతో సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిచాడు. స్పీకర్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.