Supreme Court | వివిధ కేటగిరిల్లో సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓ వ్యాజ్యంపై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయంలో ప్రాక్టికాలిటీని సైతం చూడాలని పేర్కొంది. వైకల్యంపై సానుభూతి ఒక అంశం అయితే, ప్రాక్టికాలిటీని సైతం గుర్తుంచుకోవాలని జస్టిస్ ఎస్ఏ నజీర్, వీ రామసుబ్రహ్మణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
దివ్యాంగులు అన్ని కేటగిరిలకు సరిపోరని కోర్టు అభిప్రాయపడింది. సానుభూతి అనేది ఒక అంశమైనా.. ప్రాక్టికాలిటీ మరో అంశమని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టు ఓ ఘటనను ప్రస్తావించింది. చెన్నైలో వందశాతం అంధుడిని జూనియర్ విభాగంలో సివిల్ జడ్జిగా నియమించారని, తర్వాత తమిళ పత్రికకు సంపాదకుడిగా పని చేశారని గుర్తు చేసింది. అయితే, సివిల్ సర్వీసెస్లోని వివిధ కేటగిరీలలో దివ్యాంగుల పాత్రపై విచారణ జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో సమయం కోరగా.. ఈ మేరకు కేంద్రానికి ఎనిమిదివారాల సమయం ఇచ్చింది.