న్యూఢిల్లీ, జూన్ 3: విమాన ప్రయాణికులు ఎక్స్ట్రా లగేజీని తీసుకువెళ్లాలంటే దానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి. ఇప్పుడు రైళ్లలో ప్రయాణించే వారు కూడా ఈ నిబంధనను పాటించాల్సిందే. ‘ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని రైల్వేశాఖ తాజాగా పేర్కొంది. టికెట్ తీసుకోకుండా ఎక్స్ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు సాగించే వారికి భారీ జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
టికెట్ తీసుకోకపోతే జరిమానా ఎంత?
టికెట్ లేకుండా ఎక్స్ట్రా లగేజీతో ప్రయాణిస్తూ పట్టుబడితే లగేజీ రుసుము కంటే ఆరు రెట్లు పెనాల్టీ వేస్తారు. ఉదాహరణకు 40 కిలోల ఎక్స్ట్రా బ్యాగ్తో ఒక వ్యక్తి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాడు అనుకొంటే.. రూ. 109 చెల్లించి ఆ వ్యక్తి లగేజీ టికెట్ తీసుకోవాలి. ఒకవేళ సదరు వ్యక్తి టికెట్ తీసుకోకపోతే.. రూ. 654ను పెనాల్టీగా వేస్తారు.
అదనపు లగేజీ రుసుము ఎలా చెల్లించాలి?
ఎక్స్ట్రా లగేజీతో ప్రయాణించే వ్యక్తి రైలు బయల్దేరడానికి కనీసం 30 నిమిషాల ముందు లగేజీ ఆఫీసులో అధికారులను సంప్రదించి ప్రత్యేక టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొనేవాళ్లు అప్పుడే రుసుము చెల్లించవచ్చు. ఎక్స్ట్రా లగేజీకి కనిష్ట రుసుము రూ. 30.