ముంబై : కలల నగరం ముంబైలో మురికివాడలు సైతం పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. అక్కడ మురుగుకాలువలు కూడా దర్శనీయ స్థలాలే. పేదరికం ఓ వస్తువు. ఆ వస్తువును దర్శించడానికీ ఓ ధర ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ధారావిని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులే కాదు ముంబైలోని సంపన్నులు సైతం ఉత్సాహపడుతున్నారు. ధారావి సైట్ సీయింగ్ కోసం రెండు గంటలకు రూ.15,000 చొప్పున అక్కడి గైడ్లు వసూలు చేస్తున్నారంటే పేదరికం కూడా ఎంత ఖరీదైన అమ్మకం సరుకుగా మార్చివేశారో అర్థం చేసుకోవచ్చు. ధారావిలోని ఇరుకు సందుల్లో అడుగుపెట్టేందుకు ముంబైవాసులు సైతం వెనుకాడుతారు. కాని విదేశీ పర్యాటకులు మాత్రం మనిషికి రూ.15,000 చొప్పున డబ్బు చెల్లించి మరీ ఆ మురికివాడలోని గుడిసెలు, ఇరుకు సందులను దర్శిస్తున్నారు. ధారావి టూర్కు వచ్చిన కొందరు విదేశీయుల బృందానికి గైడ్గా స్థానికుడు ఓంకార్ ధామలే వ్యవహరిస్తుండగా ఇండియా టుడే పత్రిక పలుకరించింది.
మనిషికి రూ.15,000 చొప్పున తాను వసూలు చేస్తున్నట్లు తన వెంట ఉన్న ఐదుగురు విదేశీ పర్యాటకులను చూపిస్తూ ధామలే చెప్పారు. కాలుపెట్టేందుకు సైతం వీల్లేని ఇరుకు సందులను అతను వీరికి చూపిస్తున్నాడు. కాగా, విదేశీ టూరిస్టులకు రేటు ఎక్కువని, దేశీయ టూరిస్టులైతే 1,500 నుంచి 7,000 మధ్య ఉంటుందని ధామలే చెప్పాడు. తమ చదువుకు అవసరమైన డబ్బు సంపాదించుకునేందుకు స్థానికులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2005లో క్రిస్ వే అనే యూరోపియన్ సామాజిక కార్యకర్త, కృష్ణ పూజారి అనే స్థానికుడు రియాలిటీ టూర్స్ పేరిట మొదట దీన్ని ప్రారంభించారు. పర్యాటకుల ద్వారా లభించిన ఆదాయంలో అధిక భాగాన్ని ధారావిలోని పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఖాకీ టూర్స్ వ్యవస్థాపకుడు భరత్ గోతోస్కర్ తెలిపారు. ధారావిలో మురికివాడల పర్యాటకం కుటీర పరిశ్రమగా మారిపోయిందని ఆయన చెప్పారు.