న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పనితీరు నచ్చనప్పుడు, ఆ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని(No Confidence Motion) ప్రవేశపెడుతుంటాయి. అయితే ఇప్పటి వరకు లోక్సభలో 27 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తొలిసారి 1963లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై తీర్మానాన్ని పెట్టారు. అత్యధికంగా 15 సార్లు ప్రధాని ఇందిరా గాంధీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక లాల్బహుదూర్ శాస్త్రి, పీవీ నర్సింహా రావులపై మూడేసి సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. 269-270 ఓట్ల తేడాతో వాజ్పేయి సర్కార్ కూలిన విషయం తెలిసిందే. ఇటీవల 2018లో చివరిసారి మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2023లో మళ్లీ తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉండాలని ఆ నాటి ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Opposition is bringing a No confidence motion against government which PM Modi had predicted 5 years ago! pic.twitter.com/PBCaUe3fqG
— DD News (@DDNewslive) July 26, 2023
ఇక ఇవాళ మరోసారి మోదీ సర్కార్పై రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ తీర్మానాలకు చెందిన నోటీసులు ఇచ్చారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే అప్పుడు ఆ సర్కార్ తన అధికారాన్ని కోల్పోతుంది. తీర్మానంపై చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్లో తీర్మానం పాస్ కావాల్సి ఉంటుంది.
లోక్సభలోని 198 రూల్ ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇస్తారు. సబ్రూల్ 2, 3 కింద ఆయా పార్టీలకు సమయాన్ని కేటాయిస్తారు.