న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన 20 ఏళ్ల మహిర్, ఢిల్లీలోని పహర్గంజ్లో ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో పనిచేశాడు. 21 ఏళ్ల యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అయితే 18 ఏళ్ల అర్మాన్ ఖాన్ కూడా ఆ మహిళతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు.
కాగా, మహిర్, ఆ యువతి వీడియో కాల్లో మాట్లాడుకోవడం అర్మాన్ కంటపడింది. దీంతో ఆమెతో ఎప్పుడూ మాట్లాడవద్దని మహిర్ను అతడు హెచ్చరించాడు. అలాగే ఆ యువతి మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. అంతటితో ఆగక మహిర్ అడ్డుతొలగించేందుకు ప్లాన్ వేశాడు. భాగీరథి విహార్ ప్రాంతానికి వస్తే యువతి మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తానని మహిర్కు ఫోన్ చేశాడు. బుధవారం రాత్రి అక్కడకు వచ్చిన అతడ్ని తన ఇద్దరు అనుచరులతో కలిసి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు వీధిలోని రోడ్డు పక్కగా యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. అర్మాన్ ఖాన్తో పాటు అతడి అనుచరులైన 21 ఏళ్ల ఫైజల్, 19 ఏళ్ల సమీర్ను అరెస్ట్ చేశారు. మహిర్ హత్యకు లవ్ ట్రయాంగిల్, అసూయ కారణమని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.