లక్నో, ఫిబ్రవరి 8: కేంద్ర ప్రభుత్వ నిధులు తమ ఖాతాల్లో పడగానే నలుగురు గృహిణులు భర్తలను వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు. కొందరు పెండ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీ జిల్లాలో వెలుగుచూసింది. స్థలం ఉన్న నిరుపేదలు పక్కా ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అర్బన్ ఆవాస్ యోజన (పీఎంఏవై-అర్బన్) కింద రూ.3 లక్షలు అందజేస్తున్నది. బారాబంకీ జిల్లాలో 40 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.50 వేల చొప్పన జమ అయ్యాయి. ఈ డబ్బులతో నలుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు. నిధులు తీసుకొని ఏడాది అయినా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టకపోవడంతో అధికారులు ఆయా లబ్ధిదారులకు నోటీసులు అందజేశారు. నిర్మాణ పనులు అయినా మొదలు పెట్టాలి లేదంటే డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారులకు చెందిన నలుగురు భర్తలు పీఎంఏవై నిధులతో తమ భార్యలు వెళ్లిపోయినట్టు తెలిపారు.