House fire: రాత్రివేళ కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోంచి మంటలు రావడం చూసి పక్కింటి వ్యక్తి వారి తలుపుతట్టాడు. దాంతో ఆ ఇంట్లోని ముగ్గురు మహిళలు తలుపులు తీసుకుని బయటికి వచ్చారు. కానీ అప్పటికే ఇంటి యజమానితోపాటు వారి పెంపుడు కుక్క సజీవదహనమైంది. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీరా అనే వ్యక్తి తన అత్త రోషిణి, భార్య, మరదలితో కలిసి ఉంటున్నాడు. ఆ కుటుంబం ఒక కుక్కను పెంచుకుంటోంది. శుక్రవారం రాత్రి భోజనాల తర్వాత అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత ఆ ఇంట్లోంచి పొగలు రావడం పొరుగింటి వ్యక్తి గమనించాడు. వెంటనే తలుపులు తట్టి ఆ కుటుంబాన్ని అప్రమత్తంగా చేయగా.. ముగ్గురు మహిళలు తలుపులు తీసుకుని బయటికి పరుగెత్తుకొచ్చారు.
అప్పటికే మహిళలు ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. బీరా, పెంపుడు కుక్క ఇంట్లోనే సజీవదహనమయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. తీవ్రంగా గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బీరా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.