చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం మరో తీర్మానం చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో ఉంచచడాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిర్ధిష్ట గడువులోగా బిల్లులను క్లియర్ చేసేలా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను ఆదేశించాలని కోరుతూ సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్లను నియంత్రించే బిల్లుకు (Online Gaming Bill) ఆ వెంటనే ఆమోదం తెలిపారు.
కాగా, మనీ బిల్లుగా వ్యవహరించే ఈ బిల్లుపై గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ప్రభుత్వం మధ్య తెగ పోరాటం జరిగింది. ఆన్లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో 40 మందికిపైగా వ్యక్తులు తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే సీఎం స్టాలిన్ ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. అయితే తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది.
మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ బిల్లుపై ఇటీవల పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీస్ ఆశావహులతో జరిగిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ఆయన, బిల్లు పెండింగ్లో ఉందంటే ఆ బిల్లు తిరస్కరించినట్లేనని, ఆ బిల్లుకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది.
Also Read: