Hot Summer : దేశంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్స్పై ఆధారపడుతున్నారు. దాంతో స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ మినిట్స్ వంటి సంస్థలకు కూలింగ్, హైడ్రేషన్ ఉత్పత్తుల ఆర్డర్లు అమాంతం పెరిగాయి. ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అమ్మకాల్లో భారీ పెరుగుదలను గమనించింది.
మార్చి చివరి వారంతో పోలిస్తే, సీజనల్ ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయని ఇన్స్టా మార్ట్ తెలిపింది. ముఖ్యంగా కోల్డ్ కాఫీ, మామిడి పళ్ల అమ్మకాలు 10 రెట్లు పెరగడం విశేషం. ఐస్క్రీమ్, శీతలపానీయాలు, పుచ్చకాయలు, మామిడి పళ్లతో పాటు పెరుగుకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్త ఐస్క్రీమ్ అమ్మకాల్లో ఒక్క బెంగళూరు నగరమే 14 శాతం వాటాను కలిగి ఉండగా, మామిడి పళ్ల ఆర్డర్లలో మూడింట ఒక వంతు వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాత చెన్నై, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. జీరా మసాలా సోడా వంటి ఉత్పత్తుల అమ్మకాలు కూడా 10 రెట్లు పెరిగాయని స్విగ్గీ పేర్కొన్నది.
మరోవైపు జెప్టో ప్లాట్ఫామ్లో ఐస్క్రీమ్లు, సన్స్క్రీన్, ఇన్స్టంట్ డ్రింక్ మిక్స్లు, టాల్కమ్ పౌడర్ వంటి వాటికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. వేడి నుంచి రక్షణ కోసం ఫ్యాన్లు, గొడుగులు కూడా నిత్యావసరాలుగా మారాయని సంస్థ పేర్కొన్నది. ఫ్లిప్కార్ట్ మినిట్స్ కూడా ఇదే తరహా ట్రెండ్ను నివేదించింది. హైడ్రేషన్ డ్రింక్స్ 12 రెట్లు, స్విమ్వేర్ 8 రెట్లు, ఏరేటెడ్ డ్రింక్స్ 2.5 రెట్లు, కీటక నివారిణులు రెట్టింపునకుపైగా అమ్ముడయ్యాయి. అమెజాన్ నౌ, టాటా గ్రూప్కు చెందిన బిగ్బాస్కెట్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. బిగ్బాస్కెట్లో ఐస్క్రీమ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 100 శాతం వృద్ధిని సాధించాయి. మజ్జిగ, లస్సీ, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్యాన్లు, కొబ్బరి నీళ్లు, మామిడి పళ్లు డబుల్ డిజిట్ వృద్ధిని చూశాయి.
దేశంలోని చాలా ప్రాంతాల్లో హీట్ వేవ్ రోజుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడం ఈ డిమాండ్కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గకపోవడంతో ప్రజలు ఉపశమనం కోసం 24 గంటలూ చల్లదనాన్ని అందించే ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు కొచ్చి, మధురై వంటి చిన్న నగరాల్లో కూడా ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.