న్యూఢిల్లీ, జనవరి 2: దవాఖానలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో రోగులను అడ్మిట్ చేసుకోవటంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ లేదా అతడి బంధువులు నిరాకరిస్తే.. సదరు రోగిని దవాఖానలు ఐసీయూలో అడ్మిట్ చేయరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఐసీయూలో రోగి అడ్మిషన్, వైద్య చికిత్సకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల్ని కేంద్రం తాజాగా వెల్లడించింది. తీవ్ర ఆరోగ్య సమస్య నుంచి రోగిని కాపాడేందుకు మాత్రమే ఐసీయూ అడ్మిషన్ కారణం అవ్వాలని దవాఖానలకు సూచించింది. ఒకవేళ రోగి, అతడి బంధువులు నిరాకరిస్తే ఐసీయూ నుంచి సదరు రోగిని డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి 24 మందితో కూడిన నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది.
మహమ్మారి లేదా విపత్తు పరిస్థితుల్లో, పరిమిత వనరులున్నప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచటానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తదుపరి వైద్య చికిత్స సాధ్యం కానప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, అప్పటివరకు అందిస్తున్న వైద్య చికిత్సతో ఫలితం లేనప్పుడు, ముఖ్యంగా రోగి జీవించే అవకాశం లేనప్పుడు.. ఐసీయూలో చేర్చుకోవద్దని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. రోగి లేదా అతడి బంధువుల నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారు నిరాకరిస్తే.. రోగిని ఐసీయూలో చేర్చుకోరాదని స్పష్టంచేసింది.
అవయవ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ అవసరమైనప్పుడు, రోగి ఆరోగ్యం విషమించే పరిస్థితులు ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకోవచ్చు. శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి దిగజారితే.. అప్పుడు కూడా పేషెంట్ను ఐసీయూలో కొనసాగించవచ్చు. గుండె, శ్వాసనాళాల్లో సమస్య లు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగుల ను కూడా ఐసీయూలో చేర్చొచ్చు. అలాగే ఐసీయూలో రోగిని చేర్చేముందు.. బీపీ, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధా నం, హృదయ స్పందన, ఆక్సిజన్ శాచురేషన్ తదితర అంశాలను పర్యవేక్షించాలి.