బెంగళూరు: ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లి కవల శిశివులకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం ఆమెతోపాటు ఆ శిశివులు మరణించారు. బీజేపీ పాలిత కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. నిరుపేద, ఒంటరి మహిళ అయిన తమిళనాడుకు చెందిన 30 ఏళ్ల కస్తూరి, నిరాశ్రయురాలైన బాలికతో కలిసి భారతీనగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నది. నిండు గర్భవతి అయిన ఆమెకు బుధవారం రాత్రి నొప్పులు వచ్చాయి. దీంతో ఇరుగుపొరుగు వారు తలో కొంత డబ్బులు ఇచ్చి ఆటోలో తుమకూరు జిల్లా ఆసుపత్రికి పంపారు.
కాగా, ప్రసవ వేదన పడుతున్న కస్తూరికి ఆధార్ కార్డు, మెటర్నరీ కార్డు లేవు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు డ్యూటీ డాక్టర్ నిరాకరించాడు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి వెళ్లాలని కాగితంపై రాసి ఇచ్చాడు. చేసేదేమీ లేక ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అతి కష్టం మీద ఒక శిశివుకు జన్మ ఇచ్చింది. పురిటి నొప్పులు, రక్తస్రావం ఎక్కువ కాగా మరో శిశువును కని మరణించింది. ఆ కవల శిశివులు కూడా చనిపోయారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలిసి వైద్యాధికారులు స్పందించారు. డ్యూటీ డాక్టర్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి తెలిపారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.