Narottam Mishra | బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితులను విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో దోషుల విడుదలపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా తీవ్రంగా స్పందించారు. షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాస్ స్లీపర్ సెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో కన్హయ్య లాల్ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే దేశంలో ఉండేందుకు భయపడుతారంటూ విమర్శించారు. అదే సమయంలో అవార్డ్ వాప్సీ గ్యాంగ్ యాక్టివేట్ అవుతుందని, ఆ తర్వాత గొంతు చించుకుని ఏడవడం మొదలుపెడుతారని అన్నారు. ఈ వ్యక్తులంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, దీన్ని నాగరికత, సెక్యులర్ అని ఎలా అంటారన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను షబానా అజ్మీ ఖండించారు. పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దోషుల విడుదల నిర్ణయం పట్ల తాను సిగ్గుపడుతున్నానని, దీనిపై మాట్లాడటానికి తన వద్ద పదాలు లేవని పేర్కొన్నారు.