న్యూఢిల్లీ, డిసెంబర్ 20: బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ-1860, సీఆర్పీసీ-1898, ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త నేర న్యాయ బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ(రెండో) సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష(రెండో) సంహిత, భారతీయ సాక్ష్య(రెండో) బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్షా సభలో ప్రవేశపెట్టగా స్వల్ప కాలిక చర్చ అనంతరం మూజవాణి ఓటుతో బిల్లులను కేంద్ర సర్కార్ ఆమోదింపజేసుకొన్నది. లోక్సభలో విపక్షాలకు చెందిన 90 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేసిన క్రమంలో ఈ బిల్లులను మోదీ సర్కార్ ఆమోదింపజేసుకోవడం గమనార్హం. కాగా, గతంలో తీసుకొచ్చిన మూడు బిల్లులపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఇటీవల వాటిని వెనక్కు తీసుకొన్న కేంద్రం.. వెంటనే కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు
కొత్త బిల్లులు జరిమానాలు విధించే బదులు న్యాయం అందించడంపై దృష్టి పెడతాయని అమిత్షా పేర్కొన్నారు. వలస కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లులు మానవ కేంద్రీకృత విధానంతో నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాయన్నారు. వాటిల్లో శిక్షించాలనే ఉద్దేశం ఉందే తప్ప న్యాయం చేయాలనే అంశం లేదని పేర్కొన్నారు. కొత్త ప్రతిపాదిత బిల్లుల్లో ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఉన్నదని, దేశద్రోహాన్ని నేరంగా తొలగించి, ‘రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు’ అనే కొత్త సెక్షన్ను ప్రవేశపెట్టామని తెలిపారు.
మూక దాడులకు మరణ శిక్ష
బిల్లుల్లోని కీలక అంశాలను అమిత్షా ఈ సందర్భంగా స్వల్పంగా వివరించారు. మూక దాడులకు కొత్త బిల్లులు మరణ శిక్ష విధిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ విధమైన శిక్షను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ‘ఒకరి మెదడు భారతీయులదైతే వారికి చట్టాలు అర్థం అవుతాయి. అదే ఇటాలియన్ది అయితే అర్థం కావు.. ’అని ప్రతిపక్ష కాంగ్రెస్ను ఉద్దేశించి అమిత్షా వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే, అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదని, అది అతని భావ ప్రకటనా స్వేచ్ఛ అని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు పాల్పడితే, అటువంటి వారిని సహించేది లేదని, కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
టెలికాం బిల్లుకు లోక్సభ ఆమోదం
టెలీ కమ్యూనికేషన్స్ బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టం-1985, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫీ చట్టం-1933లను రద్దు చేస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు ప్రధానంగా వినియోగదారుల రక్షణకు ఉద్దేశించినదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక నుంచి సిమ్ కార్డుల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, ఉల్లంఘనులకు మూడేండ్ల వరకు శిక్ష, జరిమానా పడుతుందని చెప్పారు.
మరో ఇద్దరు ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ 143కి చేరిన సంఖ్య
భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్లో విపక్ష పార్టీల ఎంపీల ఆందోళన కొనసాగింది. విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కూడా కొనసాగింది. మరో ఇద్దరు ఎంపీలపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఉభయ సభల్లో సస్పెన్షకు గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది. తాజాగా సభలో ప్లకార్డులు ప్రదర్శించారని పేర్కొంటూ కేరళ కాంగ్రెస్(మణి) థామస్, సీపీఎం ఎంపీ ఏఎం ఆరిఫ్ ఖాన్ల సస్పెన్షన్పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం పెట్టారు. భద్రత ఉల్లంఘన ఘటనపై హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజ్యసభ కూడా వాయిదాల పర్వంలో నడిచింది.