న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీలోని సైనిక దవాఖాన నుంచి వారి భౌతికకాయాలను రావత్ నివాసానికి తరలించారు. ప్రజలు, ఆర్మీ సిబ్బంది సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రావత్ దంపతులకు పుష్పాంజలి ఘటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ గవర్నర్ అనిల్ బైజల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నివాళులు అర్పించారు.
సీడీఎస్ రావత్ దంపతులకు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు సైనిక సిబ్బంది నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గోర్ఖా రైఫిల్స్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.