న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించాలంటూ ఎల్జీ సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ శనివారం సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రజాస్వామ్య విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్య విజయం. నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. రెండున్నర నెలల తర్వాత ఢిల్లీకి మేయర్ రానున్నారు. ఢిల్లీలో ఎల్జీ, బీజేపీ నిత్యం చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని కోర్టులో రుజువైంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం తన అభిప్రాయాలను సుప్రీంకోర్టు ముందు సమర్పించకుండా నిరోధించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చాలా ప్రయత్నించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. న్యాయ ని ర్వహణలో ఆయన జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. తన న్యాయవాదిని కేసులో ఇరువైపులా వాదించేలా చేశారని విమర్శించారు.
పురపాలక సభ్యుల ఓటు హక్కుల కేసులో కోర్టు ధిక్కార నేరానికి ఎల్జీ సక్సేనా పాల్పడ్డారని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కేసును ప్రభావితం చేసేందుకు ఆయన మోసపూరితంగా ప్రయత్నించారని విమర్శించారు. అయితే సుప్రీంకోర్టు దీనిని గ్రహించిందన్నారు. ఎల్జీ తీరు వల్లనే ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడిందంటూ మండిపడ్డారు.