భోపాల్: పెళ్లి వేడుకలో తేనెటీగలు గందరగోళం సృష్టించాయి. హాజరైన అతిథులపై తేనెటీగల గుంపు దాడి చేశాయి. (bees attacked at wedding ceremony) దీంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి సీరియస్గా ఉన్నవారిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కస్తూరి గార్డెన్ హోటల్ రూఫ్పై తేనెపట్టులు ఉన్నాయి. దీంతో ఆ గార్టెన్లో జరుగుతున్న పెళ్లికి తేనెటీగలు అంతరాయం కలిగించాయి. వివాహ వేడకకు హాజరైన వారిపై తేనెటీగలు గుంపుగా దాడి చేశాయి. దీంతో పలువురు భయంతో అక్కడ పరుగులు తీశారు. తేనెటీగలు కుట్టడంతో 12 మంది గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. వైద్య బృందాలను అక్కడకు రప్పించారు. తేనెటీగలు కుట్టడంతో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కొందరిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై ఆ హోటల్ మేనేజ్మెంట్ స్పందించింది. రూఫ్పై ఉన్న తేనెటీగల నివారణపై చర్యలు చేపట్టింది.