న్యూఢిల్లీ: లింగ సమానత్వానికి ఇదో చారిత్రక ఉదాహరణ. ఇవాళ సుప్రీంకోర్టు ( Supreme Court ) న్యాయమూర్తులుగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రాత్మకం. మొత్తం 9 మంది సుప్రీం జడ్జిలుగా ఇవాళ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. మహిళా జడ్జీలుగా ప్రమాణం చేసినవారిలో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బెలా ఎం త్రివేదిలు ఉన్నారు. ఈ ముగ్గురి చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది జడ్జీలు ఉన్నారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో మహిళా జడ్జీలుగా 11 మంది పని చేశారు.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీకి సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించారు. 2006లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏడాది పర్మనెంట్ జడ్జి అయ్యారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఆమె న్యాయమూర్తిగా 2024, సెప్టెంబర్ 2 వరకు ఉంటారు.
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగర్నత. కర్నాటక హైకోర్టు సీజేగా ఉన్న ఆమె.. అన్నీ అనుకూలిస్తే 2027లో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె బాధ్యతలు స్వీకరించినా.. కేవలం 36 రోజులు మాత్రమే ఆ విధుల్లో కొనసాగే అవకాశం ఉంది.
గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ బెలా ఎం త్రివేది.. సుప్రీంకోర్టు జడ్జిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. 2011లో రాజస్థాన్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆమె మళ్లీ గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2003 నుంచి 2006 వరకు గుజరాత్ ప్రభుత్వానికి న్యాయ కార్యదర్శిగా చేశారు. 2025, జూన్ 10 వరకు జస్టిస్ బెలా త్రివేది సుప్రీం జడ్జీగా ఉంటారు.