ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. (Uddhav Thackeray) ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరానికి అందిన విరాళాలలో జరిగిన అవకతవకలపై ‘రామ రక్షా ఆందోళన్’ను ఆయన ప్రారంభించారు. ఆదివారం ముంబైలోని దాదర్లో వందలాది మంది శివసేన (యూబీటీ) కార్యకర్తలతో కలిసి రామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, మారుతీ స్తోత్రం పఠించారు.
కాగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘హిందువులను దోచుకుంటోందని’ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందువులను దోచుకుంటున్న ప్రభుత్వం. ఇది కేదార్నాథ్-బద్రీనాథ్తో మొదలైంది. ఇప్పుడు అయోధ్య వంతు. అయోధ్య ఒక ట్రైలర్ మాత్రమే. కాశీ, మధుర ఇంకా చాలా ఉన్నాయని వారు అంటారు. అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని అన్నారు.
మరోవైపు హిందువులను దోచుకుంటున్న హిందువులు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ‘మేము పరాక్రమవంతులం, అమాయకులం, దేశాన్ని ప్రేమించే హిందువులం, కానీ మూర్ఖులం కాదు’ అని అన్నారు. ‘ఈ రోజు హిందువులు మాయలో పడ్డారు. దేశంలోని హిందువులంతా మేల్కొని, శ్రీరాముడిని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని నేను కోరుతున్నా’ అని పిలుపునిచ్చారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ‘రామ రక్షా ఆందోళన్’ కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.