బెంగళూరు: ఒక దర్గాలో ఒకే రోజు వేడుకలు నిర్వహించేందుకు హిందూ, ముస్లింలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మతపరంగా ఎలాంటి అలజడి జరుగకుండా ఉండేందుకు పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. బీజేపీ పాలిత కర్ణాటకలోని ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని బెంగళూరుకు 600 కిలోమీటర్ల దూరంలోని కలబురగి జిల్లాలో అలంద్ అనే చిన్న పట్టణం ఉంది. ఇక్కడి దర్గాలో ఒక సూఫీ సన్యాసి మందిరంతోపాటు కాంపౌండ్లో రాఘవ చైతన్య శివలింగం కూడా ఉంది. సూఫీ సెయింట్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు.
మరోవైపు కర్ణాటక హైకోర్టుకు చెందిన కలబురగి బెంచ్ శుక్రవారం అరుదైన తీర్పు ఇచ్చింది. దర్గాలోని శివలింగానికి హిందువుల పూజలకు మత ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ తీర్పును రద్దు చేయాలన్న దర్గా నిర్వాహకుల విన్నపాన్ని తిరస్కరించింది. హిందూ, ముస్లింలు శనివారం వేర్వేరు సమయాల్లో ఈ దర్గాలో తమ ఆచారాలు పాటించేందుకు వీలు కల్పించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రార్థనల కోసం 15 మంది ముస్లింలకు అనుమతించింది. అలాగే శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్గాలోని శివలింగానికి పూజల కోసం 15 మంది హిందువులకు అనుమతి ఇచ్చింది.
కాగా, ఈ ప్రాంతంలో గతంలో మతపరమైన ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు వంటి సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం హిందూ, ముస్లింలు ఆ దర్గాలో తమ ఆచారాలకు సిద్ధం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రత కోసం సుమారు 500 మంది పోలీసులను మోహరించారు. దర్గా పరిసరాల్లో 12 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మతపరమైన ఉద్రిక్తతలు జరుగకుండా డ్రోన్లతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. కర్ణాటకలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు.