కరాచీ: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఘెట్కీ జిల్లాలో రెండు ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో సతన్లాల్ అనే వ్యాపారిని దుండుగులు కాల్చి చంపారు. సతన్లాల్కు చెందిన భూమిలో కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్లుకు ప్రారంభోత్సవం జరుగుతుండగా ఈ ఘాతానికి పాల్పడ్డారు. పలుకుబడి కలిగిన దహర్ వర్గానికి చెందిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘వారు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. నా కండ్లు పీకి, చేతులు, కాళ్లు నరికేస్తామని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ వదిలి పారిపోవాలని అంటున్నారు. నేను ఈ దేశానికి చెందిన వాడిని. ఇక్కడే చనిపోతాను కానీ వారికి నేను లొంగను’ అని కొద్ది నెలల కింద విడుదల చేసిన వీడియోలో సతన్లాల్ పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్న వారి పేర్లను కూడా వీడియోలో పేర్కొన్నారు. ఈ హత్యలో నిందితుడు బచ్చన్ దహర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సతన్లాల్ హత్యకు నిరసనగా స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.