‘ముస్సోలిని కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాల కాలం పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయన సన్నిహితులు ఈ 8 ఏండ్లలో చేసిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడానికి దేశానికి అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు’.. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా ఓ సందర్భంలో అన్న మాటలివి. ఇప్పుడవి అక్షర సత్యాలుగా మారబోతున్నాయి. ప్రధాని మోదీ ఆప్తమిత్రుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డొల్ల కంపెనీలతో ఆయన నిర్మించిన మాయా సామ్రాజ్యం మార్కెట్ను ముంచబోతున్నదంటూ హెచ్చరించింది ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ తాజా నివేదిక.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డట్టు ప్రముఖ ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రిసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ బుధవారం సంచలన నివేదికను ప్రచురించింది. అప్పుల కోసం అదానీ గ్రూప్ ఏయే మోసాలకు పాల్పడింది.. షేర్ల ధరలను కృత్రిమంగా ఎలా పెంచింది.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ మోసాల కోసం ఏయే అడ్డదారులు తొక్కిందో రెండేండ్లపాటు సమగ్ర దర్యాప్తు జరిపి ఈ నివేదికను రుజువులతో సహా ప్రచురించింది. కార్పొరేట్ ప్రపంచ చరిత్రలో దీన్నో అతిపెద్ద కుట్రగా అభివర్ణించింది. ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ నివేదికను రాయిటర్స్, బ్లూమ్బర్గ్, ఫోర్బ్స్, క్వార్ట్ వంటి అంతర్జాతీయ న్యూస్ వెబ్సైట్లు ప్రధానంగా ప్రచురించాయి. గౌతమ్ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లు (రూ. 9.7 లక్షల కోట్లు). మూడేండ్ల కిందట ఇది 20 బిలియన్ డాలర్లే (రూ. 1.6 లక్షల కోట్లు). గత మూడేండ్లలో తన గ్రూప్నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కృత్రిమంగా పెంచి ఆయన మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేండ్లలోనే ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది.
గ్రూప్ ఆర్థిక స్థితిని ఫేస్ వ్యాల్యూతో గణించినప్పటికీ, అదానీకి లాభాలను కట్టబెట్టిన ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్జోన్లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ, ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదంటూ ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ నివేదిక పేర్కొంది. నష్టాలతో ట్రేడ్ అవుతున్న ఆ కంపెనీల వాటాలను తనఖా పెట్టి అదానీ గ్రూప్ భారీగా రుణాలను పొందిందని, తద్వారా కంపెనీ వాటాదార్ల సొమ్మును, గ్రూప్ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్టేనని వెల్లడించింది. అదానీ గ్రూప్ మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలకు గానూ భారీగా డబ్బు వెచ్చించినట్లు కూడా నివేదిక ఆరోపించింది.
అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీతో పాటు అదానీ కుటుంబ సభ్యులు ట్యాక్స్ హెవెన్ (పన్ను ఎగవేతకు స్వర్గధామాలు) దేశాలైన మారిషస్లో 38 డొల్ల (షెల్) కంపెనీలతో పాటు సిప్రస్, యూఏఈ, సింగపూర్, పలు కరేబియన్ దీవుల్లో పదుల సంఖ్యలో షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని తెలిపింది. ఈ కంపెనీల్లో ఉద్యోగులు లేరని, కార్యకలాపాలు జరిగేవి కాదని, అసలు అక్కడ కార్యాలయాలు, ఫోన్ నంబర్లు ఇవేమీ ఉండేవి కాదని వెల్లడించింది. అయినప్పటికీ, పన్ను ఎగవేతకు పాల్పడుతూ.. ఈ డొల్ల కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలు అదానీ గ్రూప్నకు పెట్టుబడులుగా వచ్చేవని వివరించింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించడం, తప్పుడు టర్నోవర్ రిపోర్టుల తయారీ, కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లించటం తదితర కార్యకలాపాలకు అదానీ కంపెనీలు పాల్పడ్డట్టు ఆరోపించింది. 1.4 లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్ ఇప్పటికే నాలుగు కేసుల్లో ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటున్నదని గుర్తుచేసింది.
అదానీ కంపెనీల అక్రమాలపై దర్యాప్తు చేసే దమ్ము ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీకి ఉందా? ఈ వార్తను ఏ జాతీయ మీడియా కూడా ప్రసారం చేయదని కచ్చితంగా చెప్పగలను. చర్చా కార్యక్రమాలనూ ప్రధాన స్రవంతి మీడియా నిర్వహించదు. సోషల్మీడియా వేదికల నుంచి ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ నివేదికను తొలగించేలా ఎన్పీఏ గవర్నమెంట్ ఒత్తిళ్లు కూడా తీసుకురావచ్చు.
-ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
ఎనిమిదేండ్ల క్రితం రూ.17 వేల కోట్ల నికర ఆస్తులను కలిగిన అదానీ.. ఇప్పుడు రూ. 9.8 లక్షల కోట్లకు పడగెత్తడం వెనుక ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో పాటు ఆర్థిక అవకతవకలు కూడా ఉన్నట్టు గతంలోనూ ఆరోపణలొచ్చాయి. హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ లాంటి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకుల ద్వారా గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని అమెరికా ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (ఫిన్సెస్) ఆరోపించింది. ట్యాక్స్ హెవెన్ దేశాల్లో ఒకటిగా పేర్కొన్న సీషెల్స్ నుంచి సింగపూర్లోని ‘అదానీ గ్లోబల్ పీటీఈ’కి మనీలాండరింగ్ ద్వారా బిలియన్ డాలర్ల నిధులు బదిలీ అయినట్టు అప్పట్లో వెల్లడించింది.
గనులు, రేవులు, విద్యుత్తు, ఎయిర్పోర్ట్లు, డాటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ, సిమెంట్, టెలికం, మీడియా తదితర రంగాల్లో విస్తరిస్తున్న అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్సైట్స్ గత ఆగస్టులో హెచ్చరించింది. ఎడాపెడా తీసుకున్న రుణాల్నే ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడి చేస్తున్నదంటూ పేర్కొంది. అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన వృద్ధి ప్రణాళికలు.. పరిస్థితులు ప్రతికూలిస్తే రుణ ఊబిలోకి దించుతాయని, దీంతో గ్రూప్ మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికను జారీచేసింది. అదానీ గ్రూప్నకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల స్థూల రుణం 2022 మార్చినాటికి రూ. 2.31 లక్షల కోట్ల మేర ఉన్నదని ఫిచ్ వెల్లడించింది. ఒకవేళ గ్రూప్ దివాలా అంచునకు చేరితే.. రూ.21 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చు. ఇది పరోక్షంగా కోట్లాది భారతీయులపై ప్రభావం చూపొచ్చు. కారణం.. విద్యుత్తు, ఎయిర్పోర్టులు, గ్యాస్, సిమెంట్, టెలికం తదితర విభాగాల్లో అదానీ గ్రూప్ వేళ్లూనుకోవడమే.
‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ ఓ ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రిసెర్చ్ సంస్థ. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నది. సంస్థలో వాస్తవంగా పనిచేసేది ఐదుగురు ఉద్యోగులే అయినప్పటికీ, 60కి పైగా దేశాల్లోని ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, ఆర్థిక సంస్థలతో ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’కు మంచి సంబంధాలు ఉన్నాయి. నికోలా కార్పొరేషన్, క్లోవర్ హెల్త్లో జరిగిన అక్రమాలను వెలికితీసిన ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
అదానీ గ్రూప్లో గతంలో పనిచేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, వేలాది పత్రాలు, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నిఘా నివేదికలు, అదానీ గ్రూప్ కంపెనీల బ్రాంచీలు ఉన్న 12కు పైగా దేశాలను పర్యటించి ఈ నివేదికను తయారుచేసినట్టు ‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ ప్రతినిధులు తెలిపారు.
14 ఏండ్ల క్రితం.. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణం గుర్తుందా? లేని రాబడులను ఆదాయంగా చూపి వందకోట్ల డాలర్ల (రూ.8 వేల కోట్లు) మేర ఖాతా పుస్తకాలను తారుమారు చేశానని, షేర్ విలువను ఎక్కువ చేసి చూపానని సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు వెల్లడించడం ప్రపంచ మార్కెట్లను సైతం కుదిపేసింది. ఈ కేసును విచారించిన సెక్యూరిటీస్ ఎక్సేంజి బోర్డు ఆఫ్ ఇండియా.. రామలింగరాజు 14 ఏండ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా 2018లో నిషేధం విధించింది. కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. 8.1 లక్షల కోట్ల మేర (సత్యం స్కామ్తో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ) అవకతవకలకు పాల్పడిన అదానీకి రమారమీ.. 1400 ఏండ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించడంతో పాటు.. 700 ఏండ్లపాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది.