LAC | జిత్తులమారి నక్క చైనా వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటూ.. వివాదాస్పద ప్రాంతాల్లోకి త్వరగా చేరుకునేలా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్తో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో చైనా సైనిక, పౌర అవసరాల కోసం కొత్తగా రోడ్లు, విమానాశ్రయాలతో పాటు హెలిప్యాడ్లను పెద్ద ఎత్తున నిర్మించింది.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన ‘మిలటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్’ పేరుతో పెంటగాన్ ఈ నివేదికను విడుదల చేసింది. 2020 మేలో భారత్ – చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గాల్వాన్ హింసాత్మక ఘటన తర్వాత సరిహద్దుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ఇరుదేశాలు భారీగా బలగాలను మోహరించాయి. సరిహద్దులో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరుదేశాలు చర్చలు జరిపినా పురోగతి లేదు.
ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతుండగా.. గణనీయమైన పురోగతి సాధించలేదని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. చైనా సైన్యం 2022 నుంచి ఎల్ఏసీ సరిహద్దుల్లో భారీగా మౌలిక వసతులు నిర్మిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అందులో రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు, భూగర్భ నీటి నిల్వ సౌకర్యాలు, ఎయిర్ఫీల్డ్లు, సైనిక స్థావరాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. డోక్లామ్లో భూగర్భ నిల్వ సౌకర్యాన్ని నిర్మించిందని, ఎల్ఏసీలోని మూడుభాగాల్లో కొత్తగా రోడ్లు వేసిందని, భూటాన్ సరిహద్దుల్లో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేసిందని నివేదిక వెల్లడించింది. పాంగోంగ్ సరస్సుపై రెండో వంతెనను సైతం నిర్మించిందని తెలిపింది.
చైనా 2022లో సరిహద్దు రెజిమెంట్ను మోహరించిందని.. దానికి సహకారం అందించేందుకు జిన్జియాంగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్లోని రెండు భాగాలను సైతం మోహరించినట్లు పెంటగాన్ వివరించింది. వీటితో పాటు, పశ్చిమ సెక్టార్లోని ఎల్ఏసిలో నాలుగు కంబైన్డ్ ఆర్మ్డ్ బ్రిగేడ్లను, ఈస్టర్న్ సెక్టార్లో మూడు బ్రిగేడ్లు, సెంట్రల్ సెక్టార్లో మూడు బ్రిగేడ్లను మోహరించిందని.. ఎల్ఏసీ నుంచి కొన్ని బ్రిగేడ్స్ను ఉపసంహరించినా.. చాలా మంది సైనికుల ఉన్నారని అమెరికా రక్షణశాఖ పేర్కొంది.