Gaurav Gogoi : అస్సాం (Assam) రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేనివారిగా మిగిలిపోతారని విమర్శించారు.
గువాహటిలో గొగోయ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై గొగొయ్ మాట్లాడుతూ.. కమలంలో చేరితే బోరా కూడా ప్రాధాన్యం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోరాటం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీని వీడిన వారికి మధ్య ఉంటుందని గొగోయ్ అన్నారు. బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ మాజీ నాయకులు ఉన్నారని, అవినీతిపరులని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మపై విమర్శలు చేశారు. బోరా కాంగ్రెస్ను వీడటంవల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.