సిమ్లా : ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, కొవిడ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, స్టాఫ్ మెంబర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఎంబీబీఎస్ విద్యార్థులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచినట్లు ఆ రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన విభాగం శుక్రవారం ప్రకటించింది. సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు, కాంట్రాక్టు వైద్యులు, బీఎస్సీ, ఎంఎస్సీ మూడవ సంవత్సర నర్సింగ్ విద్యార్థులు, కాంట్రాక్టు ల్యాబ్ సిబ్బంది, జనరల్ నర్సింగ్, జీఎన్ఎం మూడో ఏడాది విద్యార్థులతో సహా అన్ని రకాల వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు పెంచబడ్డాయి.
పెరిగిన ప్రోత్సాహకాలు జూన్ 30 వరకు అందించబడతాయని అధికారులు పేర్కొన్నారు. వారికి లభించే సాధారణ జీతాలు లేదా చెల్లింపులకు అదనంగా ప్రోత్సాహకాలు అందించబడుతాయన్నారు. ఎంబీబీఎస్ నాల్గొవ, ఐదవ సంవత్సర విద్యార్థులు, జూనియర్, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, కాంట్రాక్టు వైద్యులు నెలకు రూ. 10 వేలు అందుకుంటారు. అదేవిధంగా బీఎస్సీ, ఎంఎస్సీ మూడో ఏడాది నర్సింగ్ విద్యార్థులకు రూ. 6 వేలు, కాంట్రాక్ట్ ల్యాబ్ సిబ్బంది, జీఎన్ఎం విద్యార్థులకు నెలకు రూ.5 వేలు లభించనున్నాయి.
ఇంతకుక్రితం హిమాచల్ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ స్పందిస్తూ ఎంబీబీఎస్ విద్యార్థులు, కాంట్రాక్టు వైద్యులు, జూనియర్, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ .3 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. నర్సింగ్ విద్యార్థులు, జనరల్ నర్సింగ్, జీఎన్ఎం మూడవ సంవత్సరం విద్యార్థులు, కాంట్రాక్టు ల్యాబ్ సిబ్బందికి నెలకు 1,500 రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. కాగా ఈ ప్రోత్సాహకాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.