సిమ్లా : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తరహా పరిస్ధితి తమ రాష్ట్రంలో నెలకొనవచ్చని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఆందోళన వ్యక్తం చేశారు. హిమాచల్కు విపత్తు నిధులను పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిల్ స్టేట్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కోతకు గురికావచ్చని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం సుఖు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. డాప్లర్ వెదర్ రాడార్ను ప్రారంభిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. వాతావరణ సమాచారంపై ఎప్పటికప్పుడు ఈ రాడార్ మెరుగైన వాతావరణ సేవలను, వాతావరణ హెచ్చరికలను, డేటాను అందిస్తుంది. తమకు నాలుగు డెడికేటెడ్ డాప్లర్ వెదర్ రాడార్ వ్యవస్ధలు అవసరమని సుఖు పేర్కొన్నారు.
భూమి కోతకు గురయ్యే ప్రమాదం నెలకొనడంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. కిన్నౌర్, లహౌల్, స్పిటి జిల్లాల్లో 30 శాతం ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్స్ వాటిల్లాయని, ఆయా ప్రాంతాల్లో భూములకు పగుళ్లు కనిపించాయని సీఎం తెలిపారు. రెండు, మూడేండ్ల కిందట కిన్నౌర్లో క్లౌడ్ బరస్ట్తో జనజీవితం ప్రభావితం కావడంతో పాటు ఆస్తులకు నష్టం వాటిల్లగా హైడ్రోపవర్ ప్రాజెక్టులూ దెబ్బతిన్నాయని సీఎం గుర్తుచేశారు.