న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో కాంగ్రెస్కు షాక్ ఇస్తూ.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆ రాష్ట్ర స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆయన వేటు వేశారు. నినాదాలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ కుల్దీప్ సింగ్ తెలిపారు. స్పీకర్ ఛాంబర్లో నినాదాలు చేయడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల్లో జైరాం ఠాకూర్, విపిన్ సింగ్ పర్మార్, రణ్దీర్ శర్మ, లాకెండర్ కుమార్, వినోద్ కుమార్, హన్స్ రాజ్, జనక్ రాజ్, బల్బీర్ వర్మ, త్రిలోక్ జంవాల్, సురేందర్ షోరి, దీప్ రాజ్, పురాన్ ఠాకూర్, ఇందర్ సింగ్ గంధి, దిలీప్ థాకూర్, ఇందర్ సింగ్ గంధీ ఉన్నారు.
క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, సీఎం సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ నేత జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత కష్టాల్లో పడినట్లు అయ్యింది. కాంగ్రెస్ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు.