సిమ్లా: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ నిలిపివేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. (Himachal Assembly) ఎమ్మెల్యేల ఫిరాయింపులను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల భత్యాలు, పెన్షన్) సవరణ బిల్లు 2024ను సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లులో ప్రస్తావించారు. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా అనర్హులుగా ఉన్నట్లయితే, చట్టం ప్రకారం ఒక వ్యక్తి పెన్షన్కు అర్హులు కాదు’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం ఇతర పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో వారిపై అనర్హత వేటు పడింది.