షిమ్లా : సెల్ఫీ మోజు తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్నది. ఈ విషాదకర ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకున్నది. సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందారు. మృతులను దక్షిణ ఢిల్లీకి చెందిన ప్రీతి భసీన్(37), పులకిత్ భసీన్(12)గా గుర్తించారు. బియాస్ నదిలో ఓ మహిళ, ఆమె కుమారుడు మునిగిపోయారని స్థానిక హోటల్ ప్లేయర్ గ్రాండ్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మహిళతో పాటు బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియాస్ నదిలో దిగిన వీరు సెల్ఫీ తీసుకుంటుండగా పడిపోయారు. దీన్ని గమనించిన ఒక వ్యక్తి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. వీరి మృతదేహాలు సంఘటనా స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి.