న్యూఢిల్లీ, ఆగస్టు 18: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ సహా 9 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం సమావేశమై చర్చించింది. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి 9 మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో జస్టిస్ హిమా కోహ్లితో పాటు మరో మూడు రాష్ర్టాల హైకోర్టుల సీజేలు కూడా ఉన్నారు. వారు… కర్ణాటక సీజే జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ విక్రమ్నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జితేంద్ర కుమార్ మహేశ్వరి. జాబితాలోని మిగతావారు జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్టు), జస్టిస్ సీటీ రవికుమార్ (కేరళ హైకోర్టు), జస్టిస్ ఎంఎం సుంద్రేష్ (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ బేలా త్రివేది (గుజరాత్ హైకోర్టు). వీరితో పాటు సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ పేరును కూడా కొలీజియం సిఫారసు చేసింది. మొత్తం 9 మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఒకేసారి ముగ్గురు మహిళా జడ్జిల పేర్లను సిఫారసు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నెల 12న జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బుధవారం జస్టిస్ నవీన్ సిన్హాల రిటైర్మెంట్తో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 24కు తగ్గింది. సీజేఐతో కలిపి 34 మంది జడ్జిల వరకు ఉండవచ్చు. చాలాకాలంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగలేదు. ఇప్పుడు కొలీజియం సిఫారసుకు ఆమోదం లభిస్తే సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కు చేరుతుంది. సీజేఐ అధ్యక్షతన కొలీజియంలో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు.
తొలి మహిళా సీజేఐగా జస్టిస్ నాగరత్న!
సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకానికి కొలీజియం సిఫారసుచేసిన పేర్లలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న పేరు ఉంది. ఆమె నియామకానికి ఆమోదం లభిస్తే… ఆమె 2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్నది. అది దేశ న్యాయవ్యవస్థలో చరిత్రాత్మక ఘట్టం అవుతుంది. జస్టిస్ నాగరత్న తండ్రి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
బార్ నుంచి బెంచ్కు…
సుప్రీంకోర్టు 71 ఏండ్ల చరిత్రలో బార్ నుంచి బెంచ్కి పదోన్నతి పొందిన ఆరో న్యాయవాదిగా పీఎస్ నరసింహ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది. 1993 కొలీజియం వ్యవస్థ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఐదుగురు సీనియర్ న్యాయవాదులకు నేరుగా సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. వారు… ఎన్.సంతోష్ హెగ్డే, ఆర్ఎఫ్ నారిమన్, యూయూ లలిత్, ఎల్ నాగేశ్వరరావు, ఇందు మల్హోత్రా.
ఊహాజనిత వార్తలు దురదృష్టకరం: సీజేఐ
జడ్జిల నియామక ప్రక్రియ పవిత్రమైనదని, దాని పవిత్రతను మీడియా గుర్తించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. కొలీజియం సమావేశం గురించి ఊహాగానాలతో వార్తలు రాయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన, ఊహాగానాలతో చేసే రిపోర్టింగ్ వల్ల వృత్తిలో పదోన్నతికి అర్హులైన ప్రతిభావంతులకు నష్టం కలిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సీజేఐ నేతృత్వంలోని కొలీజియం.. సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది పేర్లను సిఫారసు చేసిందంటూ మీడియాలో కథనాలు రావడంపై జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా బుధవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టుకు జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇంకా నిర్ణయం తీసుకోకముందే మీడియాలో ఊహాగానాలను రాయడం సరికాదన్నారు. మరోవైపు, ఇలాంటి సీరియస్ అంశాలపై ఊహాగానాలను వ్యాప్తి చేయకుండా మెజారిటీ సీనియర్ జర్నలిస్టులు పరిణతితో బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని అభినందించారు. 2017లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ సిన్హా ముక్కుసూటితనానికి, నిష్పాక్షితకు పెట్టింది పేరని సీజేఐ కొనియాడారు.