బెంగళూర్ : కర్నాటక సీఎంగా తప్పుకుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న బీఎస్ యడియూరప్ప చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూర్చారు. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంఘం డీఏ పెంపుపై ఇటీవల ముఖ్యమంత్రి యడియూరప్పకు వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో ఆరు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, కర్నాటకలో యడియూరప్ప పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 2019 అక్టోబర్లో చివరిసారిగా డీఏ పెంపు నిర్ణయం జరిగింది.