బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారడం లేదు. బుధవారం శివమొగ్గలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగాయి. వాట్సాప్ స్టడీ గ్రూప్లో పాక్కు చెందిన జెండాను పోస్ట్ చేసినందుకు ఓ విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. పాక్ జెండాను పోస్ట్ చేసిన విద్యార్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కూడా రంగంలోకి దిగి విద్యార్థినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.. కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు. గత నెల, చిక్కమగళూరు జిల్లాకు చెందిన బీసీఏ విద్యార్థి హిజాబ్ వివాదం కొనసాగుతున్న సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం ఉద్దేశించి క్రియేట్ చేసిన గ్రూప్లో ‘హిజాబ్ తన హక్కు’ అంటూ పోస్ట్ చేసింది. ఇదే సమయంలో విద్యార్థి భారతీయ జెండాను పోస్ట్ చేయగా.. దానికి ప్రతిస్పందనగా పాక్ జెండాను పోస్ట్ చేసింది. అయితే, ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని కోరుతున్నట్లు కళాశాల అధికారులు పేర్కొంటున్నారు.