బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్పై వివాదం కొనసాగుతున్నది. హిజాబ్ ధరించిన ముస్లిం యువతులకు ప్రవేశ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేసిన 58 మంది విద్యార్థినులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. శివమొగ్గ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతున్నది. శిరాలకొప్ప తాలూకాలోని ఓ కాలేజీకి చెందిన 58 మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. అయితే వారిని కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై నిరసన తెలిపారు. దీంతో 58 మంది ముస్లిం విద్యార్థినులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
హిజాబ్ ధారణపై నిబంధనలను ఉల్లంఘించినందున ఆ విద్యార్థులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ వారితో అన్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘డిప్యూటీ ఎస్పీ, డీడీపీఐ, ఎస్డీఎంసీ మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినా మీరు వారి మాట వినలేదు. మీరు నిబంధనలను ఉల్లంఘించారు. అందుకే మీ అందరినీ కాలేజీ నుంచి ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేసినందున మీరు కాలేజీ ప్రాంగణంలోకి వెళ్లడం కుదరదు’ అని ప్రిన్సిపాల్ వారితో అన్నారు.
కాగా, ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శివమొగ్గ జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించారు. ఈ వార్తలను ఖండించారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కేవలం నోటి మాటగా విద్యార్థినులను హెచ్చరించారని తెలిపారు. ఆ విద్యార్థుల సస్పెషన్ ఉత్తర్వులను అధికారికంగా జారీ చేయలేదని వివరించారు. దీనిని తాము నిర్ధారించుకున్నామని ఆ జిల్లా కలెక్టర్ మీడియాకు వెల్లడించారు.
మరోవైపు విద్యార్థులెవరినీ కాలేజ్ నుంచి సస్పెండ్ చేయలేదని రాష్ట్ర మంత్రి నారాయణ గౌడ్ కూడా స్పష్టం చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులను ఇండ్లకు పంపేందుకు మాత్రమే ప్రిన్సిపల్ అలా నోటి ద్వారా హెచ్చరించారని తెలిపారు. ఆ విద్యార్థులను నిజంగా కాలేజీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు.