బెంగళూరు : హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉడిపి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి (సోమవారం) నుంచి శనివారం వరకు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువచ్చింది. హిజాబ్ – కాషాయ కండువాల వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెలవులు ప్రకటించిన విషయం విధితమే.
తిరిగి సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ను అమలులోకి తీసుకురాగా.. ఉత్తర్వులు ఈ నెల 14న, ఉదయం 6 గంటల నుంచి 19న సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాఠశాలల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ డిప్యూటీ కమిషనర్ ఎం కూర్మారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలతో ఐదుగురు అంత కంటే ఎక్కువ గుమిగూడడం, నిరసనలు, ర్యాలీలు, అన్ని రకాల సమావేశాలు నిర్వహణపై నిషేధం అమలులోకి వచ్చింది.
అలాగే రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలపై నిషేధం బ్యాన్ విధించారు. ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వ్యవహారంపై కర్నాటక హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరుపనున్నది. ఈ విషయంలో గత గురువారం విచారణ జరగ్గా.. పాఠశాలలను సోమవారం నుంచి తెరువాలని, విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేకుండా తరగతులకు హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.