న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాది కాలంగా రోడ్లపై నిరసనలు తెలుపుతుంటే వారిని అక్కడ నుంచి తరలించడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకొన్నదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైవేలను ఇలా శాశ్వతంగా ఎలా బ్లాక్ చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి పరిష్కారం ఎప్పుడని ప్రశ్నించింది. రైతులు రోడ్లను బ్లాక్ చేయడంపై అభ్యంతరం చెప్తూ యూపీకి చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. కోర్టుల ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదే అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ వాదనలు వినిపించారు. రైతులతో చర్చలు జరిపామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీతో చర్చించడానికి రైతులు ముందుకు రాలేదని పేర్కొన్నారు. రైతుల యూనియన్ను కూడా ఈ పిటిషన్లో భాగస్వామిని చేయడానికి అనుమతించాలని కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదే పిటిషన్పై ఆగస్టు 26న విచారణ జరిపిన కోర్టు.. రోడ్ల బ్లాకింగ్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.