న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కొవిడ్ ఇంకా ముగియలేదని, ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన పలువురు కేంద్రమంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా పట్ల అజాగ్రత్త వహించొద్దని, రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎల్లవేళలా మాస్కులు ధరించాలని సూచించారు.
ప్రత్యేకించి రానున్న పండుగల సీజన్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వృద్ధులు, వ్యాధి సోకే అవకాశం ఉన్న వారు ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా టెస్టులు పెంచాలని, కొత్త వేరియంట్లను వేగంగా గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా కేసులపై ప్రస్తుతమున్న నిఘాను మరింత పెంచాలని సూచించారు. మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, దవాఖానల్లో సదుపాయాలు సరిపడా ఉన్నాయో పరిశీలించుకోవాలని రాష్ర్టాలకు సూచించారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్టులు
పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్పోర్టుల్లో ర్యాండమ్గా రెండు శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రయాణికులు నమూనాలను ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పింది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్గా తేలితే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని సూచించింది. ప్రయాణికుడి వివరాలను ‘ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం’కు తెలియజేయాలని చెప్పింది.
బూస్టర్ డోసుగా నాసల్ టీకా
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధిచేసిన నాసల్ టీకాను బూస్టర్ డోసుగా అందించనున్నారు. వచ్చే వారం కొవిన్లో ఈ టీకా అందుబాటులో ఉంచనున్నట్టు సమాచారం. మరోవైపు, 18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా కొవోవాక్స్ను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది.
భారత్లో ఎక్స్బీబీ వ్యాప్తి?
ప్రచారం: భారత్లో ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్బీబీ వ్యాపిస్తున్నది. ఇది డెల్టా కన్నా ఐదు రెట్లు ప్రమాదకారి. మరణాల శాతం అధికం. ఈ వేరియంట్ను గుర్తించడం కష్టం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించవు. కొత్తగా కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి, న్యుమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వాట్సాప్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం: ఎక్స్బీబీ వేరియంట్పై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కేంద్రం స్పష్టంచేసింది. ఇది సరైన సమాచారం కాదని, ప్రజలు నమ్మవద్దని సూచించింది.