న్యూఢిల్లీ : కరోనా వైరస్ తో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మాత్రమే వైద్యుల సిఫార్సు మేరకు రెమ్డిసివిర్ మందు ఇవ్వాలని అందరికీ ఇదే ఔ|షధం అవసరం లేదని, ఇది రామబాణం కాదని అత్యున్నత వైద్యుల గ్రూప్ పేర్కొంది. వైద్యులు రోగి లక్షణాలు, రిపోర్టులు పరిశీలించి అవసరమైన వారికే రెమ్డిసివిర్ ను సిఫార్సు చేస్తారని ఈ ఔషదాన్ని అవసరార్ధులకు వాడేలా సహకరించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ టెహ్రన్ పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా, నారాయణ హెల్త్ చీఫ్ డాక్టర్ దేవి షెట్టి, మెదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ టెహ్రన్ తో కూడిన అత్యున్నత వైద్యుల గ్రూప్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతంపైన ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, ఎక్సర్ సైజ్ తర్వాత ఆక్సిజన్ లెవెల్ పడిపోతే వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ దేవి షెట్టి సూచించారు. సరైన సమయంలో సరైన చికిత్స పొందడం కీలకమని స్పష్టం చేశారు. కొవిడ్ రోగుల్లో 85 శాతం మందికి పైగా రెమ్డిసివిర్ వంటి మందులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కోలుకుంటారని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. చాలామందిలో జలుబు, గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తాయని వాటికి చికిత్సను పొందడం ద్వారా వారు ఐదు నుంచి వారం రోజుల్లో కోలుకుంటారని చెప్పారు. ఇక కేవలం పదిహేను శాతం మంది వ్యాధి లక్షణాలను అధికంగా కలిగిఉంటారని అన్నారు. రెమ్డిసివిర్ మందు అవసరమైన రోగులు అతితక్కువ మందే ఉంటారని అది మేజిక్ బుల్లెట్ ఏమీ కాదని వ్యాఖ్యానించారు.